తెలంగాణలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన భేటీ ముగిసింది.
నలుగురు కొత్త మంత్రులు?
ప్రస్తుతం ఖాళీగా ఉన్న నాలుగు మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఈ విస్తరణ ఉండనున్నట్లు సమాచారం. మంత్రుల ఎంపికపై హైకమాండ్ ఓకే చెప్పినట్లు, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఉగాదికి అధికారిక ప్రకటన
ఈ నెలలోనే కొత్త మంత్రుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ, ఉగాది రోజున దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారం. దీంతో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా త్వరలోనే జరగనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇతర కీలక నియామకాలు కూడా?
కేవలం మంత్రుల పదవులు మాత్రమే కాకుండా, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ వంటి కీలక పదవుల భర్తీ కూడా జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లేందుకు, ఈ నియామకాలు త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.