ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురు మృతి

Bus collided with truck, six people died

న్యూఢిల్లీః గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్‌ – వడోదరా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై సోమవారం తెల్లవారుజామున ఓ ట్రక్కును బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆనంద్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 8 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసు సూపరిటెండెంట్‌ గౌరవ్‌ జసాని తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.