ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన పేర్కొన్న విధంగా, అధికారంలోకి వచ్చి ఏడాదైనా ప్రస్తుత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో విఫలమైందని అన్నారు. సంపద సృష్టించాల్సిన బదులు భారీ అప్పుల్లో మునిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పులలో దూకుడు –
బుగ్గన మాట్లాడుతూ – ప్రజలు ఇప్పుడే అడుగుతున్నారు మీరు చెప్పే అప్పుల లెక్కలు నిజంగా వాస్తవమా? మట్కా లెక్కలా? ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంత అప్పు తీసుకున్నారు, ఆ డబ్బును ఎక్కడ వినియోగించారు అన్న విషయాల్లో పూర్తిగా స్పష్టత లేదు. ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత గల్లంతైపోయింది, అని చెప్పారు. వైసీపీ హయాంలో రాష్ట్ర పన్నుల ఆదాయం రూ. 81,400 కోట్లు అని ఆయన గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వ ఆదాయం దానికంటే 7.5 శాతం తక్కువగా ఉందని వెల్లడించారు. సంపద సృష్టి తగ్గిపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
కేంద్రం మద్దతు ఉందంటూ అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం, ఆ మద్దతుతో ఏం సాధించింది? రాష్ట్రానికి కేంద్రం నుంచి అదనంగా వచ్చిన ఆర్థిక వనరులు ఏమి ఉన్నాయి? ఎక్కడికి వెళ్తున్నాయి ఈ అప్పుల ద్వారా వచ్చిన నిధులు? అంటూ బుగ్గన ప్రశ్నించారు. కేంద్రం సహకారంతో రాష్ట్రానికి పెట్టుబడులు, ప్రాజెక్టులు, ప్రత్యేక నిధులు వస్తాయని ప్రజల్లో నమ్మకాన్ని కలిగించినా, ఒక్కటీ కనిపించడంలేదని ఆయన ఆక్షేపించారు. తాము సామాన్య ప్రజల సంక్షేమం కోసం పాలన సాగించామని, వైసీపీ అప్పులు చేసిందని విమర్శించే కూటమి ప్రభుత్వం, అంతకంటే ఎక్కువ అప్పులు చేసి ఆ నిధులను ఎవరికి పంచుతోందని ఆయన నిలదీశారు.
సంక్షేమ పథకాల మూల్యం ఏమైంది?
బుగ్గన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలైన పథకాల గురించి ప్రస్తావిస్తూ, జగనన్న కాలంలో అమలైన వైఎస్సార్ ఆసరా, జగనన్న అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి పథకాలు ఇప్పుడు మూలపడుతున్నాయి. ప్రజలకు మద్దతుగా రూపొందించిన ఈ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కొత్తగా హామీ ఇచ్చిన పథకాలు కూడా కార్యరూపం దాల్చలేదు. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర సంపద అంతా ఎక్కడికి వెళుతోందని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
Read also: YSCP Suspension : పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశానన్న దువ్వాడ శ్రీనివాస్