విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 60 ఎకరాల భూమి కేటాయింపు వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేటాయింపుపై మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని నాని తన సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఈ భూమి కేటాయింపులో బెనామీ కంపెనీ ద్వారా ప్రమేయం ఉన్నారని ఆరోపించారు .

ఉర్సా క్లస్టర్స్కు భూమి కేటాయింపు వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి 2025 ఏప్రిల్ 10న జరిగిన సమావేశంలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖపట్నంలోని ఐటీ పార్కులో 3.5 ఎకరాలు, కాపులుప్పాడ వద్ద 56.36 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూములు కేవలం 99 పైసల ధరకు కేటాయించబడ్డాయి . ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2025 ఫిబ్రవరి 12న స్థాపించబడింది. ఈ కంపెనీకి గతంలో ఎలాంటి అనుభవం లేకపోవడం, కార్యాలయం కూడా నివాస గృహంలో ఉండడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయి .
ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు భూముల కేటాయింపు ప్రక్రియను కేశినేని తప్పుపట్టారు. అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ సంస్థకు 60 ఎకరాల భూమి కేటాయింపుపై విధానంపై అనుమానాలు వ్యక్తమౌతోన్నాయని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఉర్సా క్లస్టర్స్ సంస్థ ఏర్పాటైన కొన్ని వారాలకే భారీ ఎత్తున భూమిని కేటాయించడం సహేతుకం కాదని అన్నారు. ఈ సంస్థకు ఎలాంటి అనుభవం లేకపోవడం, భారీ ప్రాజెక్టులను అమలు చేయడానికి తగిన నేపథ్యం లేకపోవడాన్ని ఆయన ఎత్తి చూపారు. సంస్థ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి అత్యంత సన్నిహితుడని, కాలేజీలో కలిసి చదువున్నారని నాని తెలిపారు. 21 సెంచరీ ఇన్వెస్టిమెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో భాగస్వామ్యులుగా ఉండేవారని గుర్తు చేశారు. ఆ సంస్థ ప్రజల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిందనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.
బుద్ధా వెంకన్న ‘కౌంటర్’
ఈ ఆరోపణలపై బుద్ధా వెంకన్న తీవ్రంగా స్పందించారు. పార్టీ వర్గీయునిపై ఆరోపణలు చేయడం సరికాదని స్పష్టం చేస్తూ, నానిని వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. కేశినేని నాని తన సోదరుడిపై ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తూ వస్తున్నారని, ఇందులో రాజకీయ లాభం ఆశించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుందని వెంకన్న ఆరోపించారు. గతంలో నాని తన తమ్ముడిపై కూడా తీవ్రంగా వ్యవహరించారని, కుటుంబ కలహాలను కూడా రాజకీయంగా వాడుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను చెడుగా చిత్రించేందుకు నాని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ట్రావెల్స్ బోర్డు తిప్పేసి వేల కోట్ల రూపాయలకు పంగనామం పెట్టినవాడు నీతులు చెప్పడమేంటి? అంటూ నానిని ప్రశ్నించారు. మధ్యలో నాని ఉపన్యాసాలు వినేంత తీరిక, ఆయనతో చెప్పించుకునేంత ఖర్మ చంద్రబాబు లేదని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన చేరాడని ప్రజలు ఛీ కొట్టిన విషయాన్ని నాని మరచిపోయినట్టున్నాడని చురకలు అంటించారు. రాజకీయాలకు దూరమౌతున్నానని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏం ఆశించి ఇలాంటి ట్వీట్లు పెడుతున్నావంటూ నిలదీశారు.
Read also: Kesineni Nani: సొంత తమ్ముడిపై తీవ్ర ఆరోపణలు చేసిన కేశినేని నాని