హైదరాబాద్: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తదని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కార్మికుల కోసం ఎంతో చేశాడని ఇవాళ మీరు చెబుతుంటే.. ఇన్ని జేసిండా అని ఆశ్చర్యమేస్తుందని కేటీఆర్ అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం చెమట చిందిస్తున్న కార్మికుల గురించి ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు. కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తది. క్రికెట్ మ్యాచ్కు కూర్చున్నట్టు కేసీఆర్ ప్రెస్ మీట్ల కోసం కరోనా సమయంలో కూర్చునేవారు. సార్ మాట వింటే ధైర్యం వస్తదని అనుకునే వారు చాలా మంది ఉండేవారు. ఆంధ్రాలో కూడా కేసీఆర్ మాటలను ఆసక్తిగా విన్న వారు ఉన్నారని కేటీఆర్ తెలిపారు. 2014 జూన్ 2న కేసీఆర్ అధికారంలోకి వస్తే.. అదే నెల 21న హమాలీలను పిలిచి వారి సమస్యలపై మాట్లాడిండు. ఇలా హమాలీలతో భారతదేశంలో ఎవరూ లేకపోవచ్చు. ఐదేండ్లు సీఎం పదవి చేసినా వారి సమస్యలను తెలుసుకోని సీఎంలు ఉన్నారు.

ముఖ్యమంత్రి అయ్యాకనే కేసీఆర్కు కార్మికులపై ప్రేమ రాలేదు. ఆనాడు కేంద్రంలో యూపీఏలో 2004లో చేరినప్పుడు కేసీఆర్కు ఓడరేవుల ఫోర్ట్ పోలియో ఇచ్చారు. ఆ ఫోర్ట్ పోలియే కావాలని డీఎంకే పంచాయితీ పెట్టింది. నేను ఈ పదవుల కోసం రాలేదు.. తెలంగాణ కోసం వచ్చామని, వారికి షిప్పింగ్ పోర్టపోలియో ఇవ్వాలని మన్మోహన్ సింగ్కు చెప్పిండు కేసీఆర్. 9 నెలల వరకు ఎలాంటి పదవి తీసుకోలేదు. ఆఖరికి పార్లమెంట్లో ప్రతిపక్ష బీజేపీ.. కేబినెట్లో ఫోర్ట్ పోలియో లేని మంత్రి ఉంటాడా..? అని మాట్లడితే మన్మోహన్ సింగ్.. కేసీఆర్ని పిలిచి ఫోర్ట్ పోలియో తీసుకోవాలంటే.. తెలంగాణ మీద ముందడుగు వేస్తే తీసుకుంటా అని చెప్పిండు. సరే అని చెప్పి.. ఏం ఫోర్ట్ పోలియో కావాలని అడిగారు. కార్మిక శాఖ ఏరికోరి తీసుకొని.. బీడీ కార్మికులకు నాడే దేశ వ్యాప్తంగా వేలాది ఇండ్లు మంజూరు చేశారు. అసంఘటిత కార్మికుల కోసం 2005లో కమిటీ వేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని వీడి బయటకు వచ్చారు. దాంతో అసంఘటిత కార్మికులను సంఘటితం చేసే పని అసంపూర్తిగా మిగిలిపోయింది అని కేటీఆర్ గుర్తు చేశారు.