తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్థాపించబడిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను అత్యంత ఘనంగా నిర్వహించడానికి సర్వత సన్నాహాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలంలో ఏప్రిల్ 27న జరిగే ఈ సభకు లక్షలాది ప్రజలు తరలిరానున్నారు. 1,213 ఎకరాల విస్తీర్ణంలో సభ ప్రాంగణాన్ని సిద్ధం చేయగా, ముఖ్య వేదికను 154 ఎకరాల్లో నిర్మించారు. వేసవి తీవ్రత దృష్ట్యా, జనాలకు ఇబ్బందులు కలగకుండా నీటి సదుపాయాలు, ఆరోగ్య శిబిరాలు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు చేశారు.
సభ ఏర్పాట్లలో భారీ ఏర్పాట్లు
ఈ సభను బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, తన బలం దేశానికి చూపించాలనే లక్ష్యంతో భారీ ఏర్పాట్లు చేసింది. పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించగా, 2,000 మంది వాలంటీర్లు ట్రాఫిక్ నిర్వహణలో సహాయపడనున్నారు. కరెంట్ లోపం జరగకుండానే సభ కొనసాగించేందుకు 250 జనరేటర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలను తరలించేందుకు 3,000 ఆర్టీసీ బస్సులు, వేల సంఖ్యలో ప్రైవేట్ వాహనాలను కూడా సమీకరించారు. గులాబీ జెండాలతో వరంగల్ నగరం ఉత్సాహభరితంగా మారింది.
కేసీఆర్, కేటీఆర్ ప్రసంగాలపై ఆసక్తి
ఈ రజతోత్సవ సభలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగాలు చేయనున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాష్ట్ర పాలనపై, కేంద్రంపై, విపక్షాల విమర్శలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠను రేపుతోంది. రాబోయే ఎన్నికలకు పార్టీ కార్యచరణపై, భవిష్యత్తు లక్ష్యాలపై కూడా ఈ సభలో స్పష్టమైన దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం.
Read Also : Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ ‘కంఠ’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల