కాంగ్రెస్ లోకి పదో బిఆర్ఎస్ ఎమ్మెల్యే..

కాంగ్రెస్ పార్టీ లోకి మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే చేరాడు. పటాన్‌ చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోమవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మహిపాల్‌రెడ్డితో పాటు జహీరాబాద్‌ బీఆర్‌ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, ఆయన అనుచరులు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

మహిపాల్ చేరికతో ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు అయ్యింది. మహిపాల్ కు సీఎం రేవంత్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళా యాదవ్‌తో పాటు పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మహిపాల్‌రెడ్డి 2014, 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 7వేల మెజార్టీతో ఆయన విజయం సాధించారు.