కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి బీఆరెస్ ఎమ్మెల్యే

బిఆర్ఎస్ పార్టీ మరో వికెట్ కోల్పోయింది. శేరిలింగంపల్లి బీఆరెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో పలువురు కార్పొరేటర్లు, అనుచరులు చేరారు.

శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ తదితరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అరికెపూడి గాంధీ చేరిక తో ఇప్పటివరకు కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిది కి చేరింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 38 స్థానాల్లో విజయం సాధించిన తాజాగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 29కి చేరింది. కాగా మరికొంత మంది ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది.