CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొలువుల పండగ కార్యక్రమంలో పాల్గొని బిల్డ్ నౌ పోర్టల్ ను ప్రారంభించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి 922 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. కారుణ్య నియామకాలు క్రమం తప్పకుండా చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. సీఎం పదవి చేపట్టడం కన్నా.. జడ్పీటీసీగా గెలిచినప్పుడే ఎక్కువ ఆనందం కలిగిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మొదటిసారిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

స్వరాష్ట్రం వచ్చినా నిరుద్యోగుల కల నెరవేరలేదు
కారుణ్య నియామకాలు మీ హక్కు. గత ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం వల్ల మీరు పదేళ్లు నష్టపోయారు. జాబ్ క్యాలెండర్తో పాటుగా కారుణ్య నియామకాలు కూడా ఇవ్వాల్సిందే. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర మరువలేనిది. స్వరాష్ట్రం వచ్చినా నిరుద్యోగుల కల నెరవేరలేదు. పేదలు, బడుగుబలహీన వర్గాలవారే పోటీ పరీక్షలకు సిద్ధమవుతారు. నిరుద్యోగుల బాధలను ప్రజా ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఏడాదిలోనే 59వేల ఉద్యోగాలు ఇచ్చాం అన్నారు.
నిరుద్యోగుల బాధలు నాకు తెలుసు
నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది. మాకు ఉద్యోగాలు ఇవ్వని మీకు ఉద్యోగాలు ఎందుకని నిరుద్యోగులు బీఆర్ఎస్ను ఓడించారు. కారుణ్య నియామకాలపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు. నిరుద్యోగుల బాధలు నాకు తెలుసు. ఉద్యోగ ఖాళీలను పెండింగ్ పెట్టొద్దని ఆదేశాలిచ్చా. పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలోనే ఫలితాలు ఇచ్చాం. 30, 40 రోజుల్లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తాం. ఉద్యోగాలు ఇచ్చినా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.