జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు రచ్చ

brs-corporators-protest-mayor-vijayalakshmi-in-ghmc-council-meeting

హైదరాబాద్‌ః ఈరోజు ఉదయం 10 గంటలకు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే మేయర్‌ రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో సమావేశ మందిరంలో గందరగోళం నెలకొన్నది. దీంతో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లపై మేయర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్పొరేటర్లను తమ స్థానాల్లో కూర్చోవాలని సభ్యులను కోరినప్పటికీ వారు వినకపోవడంతో సమావేశాన్ని 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశం ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పురాలేదు. బీఆర్‌ఎస్‌ సభ్యులు మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో ఆమె తన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ డ్రైనేజీ సిటీ అంటూ కాల్వలను అనుసంధానం చేసి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియో సభ్యులు, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాజాసింగ్,రఘునందన్ రావు హాజరయ్యారు. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల మద్దతుతో గద్వాల్‌ విజయలక్ష్మి, మోతె శ్రీలత మేయర్‌, డిప్యూటీ మేయర్‌ గా ఎన్నికయ్యారు. వీరిద్దరూ పార్టీ మారడంతో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. కాగా.. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి బీఆర్‌ఎస్‌ను పార్టీ వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.