హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు , శాసనమండలి సభ్యులకు శిక్షణాతరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి జరగనున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల శిక్షణ తరగతులను బీఆర్ఎస్ బహిష్కరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల హక్కులకు స్పీకర్ భంగం కల్గించేలా వ్యవహరించారన్న కేటీఆర్ తొలిరోజే తమ ఎమ్మెల్యేలను లోపలికి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారని.. తమ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని బీఆర్ఎస్ విమర్శించింది.
గత శాసనసభ సమావేశాల్లోనూ బీఆర్ఎస్ సభ్యుల గొంతు నోక్కేల వ్యవహరించారని బీఆర్ఎస్ ఆరోపించింది. ప్రతిపక్ష సభ్యలకు అవకామివ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తన్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. బీఆర్ఎస్లో అతి కొద్దిమంది మాత్రమే కొత్త ఎమ్మెల్యేలున్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా ఓరియంటేషన్ సెషన్ను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ పేర్కొంది. ఇప్పటికైనా స్పీకర్ పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది.
పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందన్నట్లుగా, ఏడాది కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే ఎక్కే విమానం .. దిగే విమానం అన్నట్లు మారిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు ఉన్న సభలను కేవలం సీఎం ఒక్కరి కోసం వాయిదా వేస్తారా ? అయినా తెలంగాణ అస్థిత్వాన్ని గౌరవించలేనోళ్లు ఇక చట్టసభలను ఏం గౌరవిస్తారు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. డిసెంబరు 9 నుండి శాసనసభ సమావేశాలు అని గొప్పగా ప్రకటించి పెండ్లి కోసం సభలను వాయిదా వేస్తారా ?! చట్టసభలకు ఇచ్చే గౌరవం ఇదేనా ? అని కేటీఆర్ ప్రశ్నించారు. చుట్టాల పెండ్లికోసం చట్టసభలు వాయిదానా ? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం నవ్వులపాలు అవుతోందని బీఆర్ఎస్ అంటోంది.