భద్రాద్రి ఆలయంలో బ్రేక్‌ దర్శనం ప్రారంభం

దక్షిణాది అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో బ్రేక్‌ దర్శనం ప్రారంభమైంది. మంగళవారం నుంచి ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 9.30 వరకు, మళ్లీ రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు దర్శనం చేసుకునే వీలు కల్పించారు. ఈ సమయంలో స్వామి వారి ఉచిత, ప్రత్యేక దర్శనం, అంతరాలయ అర్చనలు తాత్కాలికంగా నిలివేయనున్నారు. బ్రేక్‌ దర్శనం టికెట్‌ ధరను రూ.200గా నిర్ణయించారు. ఆలయ కౌంటర్లు, అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టికెట్లు అందుబాటులో ఉంచారు..

రాములవారి దర్శన వేళలు చూస్తే..

రోజూ ఉదయం 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు బాలభోగం నివేదన. అనంతరం 8.35 నుంచి 9 వరకు సహస్ర నామార్చన.
ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు అర్చనలు ఉంటాయి.
ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు నిత్యకల్యాణం ప్రారంభమవుతుంది.
ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాజభోగం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు.
రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు నివేదన, అనంతరం పవళింపు సేవ ఉంటుంది.