మహబూబాబాద్లో ఇటీవల జరిగిన పార్థసారథి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు, అడ్డుగా మారిన భర్తను హత్య చేయించడానికి ప్రియుడు తన ప్రియురాలితో కలిసి ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.మహబూబాబాద్ కేంద్రంలోని శనిగపురం శివారు బోరింగ్ తండా సమీపంలో జరిగిన హత్య కి సంబంధించిన వివరాలను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గురువారం పట్టణ పోలీసు స్టేషన్లో వెల్లడించారు.
వివాహేతర సంబంధం
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కేంద్రంలోని జగదీశ్ కాలనీలో పార్థసారథి-స్వప్నకుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సొర్లాం వెంకట విద్యాసాగర్తో స్వప్నకు పరిచయం ఏర్పడింది. 2016లో స్వప్నకు పరిచయమయ్యాడు విద్యాసాగర్. పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం పార్థసారథికి తెలిసింది, పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించినా వారిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. సంబంధాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో స్వప్న, విద్యాసాగర్ కలిసి పార్థసారథిని హతమార్చాలని ప్లాన్ చేశారు.సెలవులు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి వెళ్లేవాడు పార్థసారథి. అప్పుడప్పుడు స్వప్నకు వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు. పార్ధసారథిని ఎలాగైనా అంతమొందించాలని స్వప్న తన ప్రియుడు వెంకట విద్యాసాగర్కు చెప్పింది. దీంతో వెంకట విద్యాసాగర్ కొత్తగూడెం మండలానికి చెందిన తెలుగూరి వినయ్కుమార్ , శివశంకర్ , ఏటపాక మండలానికి చెందిన వంశీ, లవరాజు లతో మాట్లాడి పార్ధసారథిని హత్య చేయించాలని పథకం వేశారు .రూ.5 లక్షల సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

కేసు నమోదు
మార్చి 28న పండుగ సెలవులకు పార్థసారథి భద్రాచలం వచ్చారు.తిరిగి 31న విధులకు వెళ్తున్న సమయంలో హత్య చేయడానికి ఇదే సమయమని భావించిన భార్య స్వప్న ప్రియుడికి ఫోన్ ద్వారా విషయం చెప్పింది.దీంతో ఉపాధ్యాయుడు ఓ వాహనం ఇచ్చి సుపారీ గ్యాంగ్ను పంపించాడు. మహబూబాబాద్ దాటిన తర్వాత పార్థసారథిని వెంబడించిన దుండగులు శనిగపురం శివారు బోరింగ్ తండా సమీపంలో అడ్డగించి ఇనుప రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. పార్థసారథి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు చాకచక్యంగా విచారించగా తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య స్వప్ననే చంపించిందని తేలింది. దీంతో స్వప్న, ప్రియుడు వెంకట విద్యాసాగర్ను అరెస్ట్ చేయగా వినయ్కుమార్, శివశంకర్, వంశీ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
.