ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు

Air India
Air India

న్యూఢిల్లీ: దేశంలో ఇటివల పాఠశాలలు, విమానాలు, ప్రముఖులకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి ఎయిర్‌ ఇండియా సంస్థకు చెందిన విమానం ఢిల్లీ నుంచి విశాఖపట్నం బయల్దేరింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానంలో బాంబు ఉందంటూ ఓ వ్యక్తి ఢిల్లీ ఎయిర్‌ఫోర్ట్‌కు ఫోన్‌ చేసి తెలిపాడు. దీంతో అధికారులు వెంటనే విశాఖ ఎయిర్‌పోర్ట్‌ అధికారులను అప్రమత్తం చేశారు. ఆ సమయంలో విమానంలో 107 మంది ప్రయాణికులు ఉన్నారు.

విమానం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ కాగానే అధికారులు ప్రయాణికుల్ని దింపేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదు. దీంతో ఆ బెదిరింపు కాల్‌ బూటకమని అధికారులు తేల్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.