ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు

Bomb threat to a school in Delhi

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే రాజధాని నగరంలోని పలు పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పాఠశాలకు ఇలాంటి బెదిరింపులే రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాష్‌ ప్రాంతంలో గల ఓ పాఠశాలకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాలను బాంబుతో పేల్చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు స్కూల్‌లో బాంబు పెట్టినట్లు గురువారం మెయిల్‌ వచ్చిందని ఢిల్లీ పోలీసులు శుక్రవారం తెలిపారు. సమాచారం అందిన వెంటనే సదరు పాఠశాల వద్దకు వెళ్లి తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.

అయితే ఆ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ లభించలేదన్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ మెయిల్‌ ఆధారంగా ఆగంతకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. వారిని త్వరలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు శుక్రవారం వెల్లడించారు.