Pakistan : బలూచిస్తాన్ ట్రైన్ హైజాక్, తాలిబాన్ల వరుస దాడులతో పాకిస్తాన్ దద్ధరిల్లుతోంది. నిన్ననే హైజాక్ భాగోతం పూర్తయింది. ఈ రోజు అక్కడ మసీదు మరోసారి బాంబు పేలింది. ఇందులో ఒక ఇస్లమిస్ట్ నాయకుడితో సహా ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. పాకిస్తాన్ గిరిజన ప్రాంతమైన వజీరిస్తాన్లో శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మసీదులో పేలుడు జరిగింది.

అబ్దుల్లా నదీమ్ లక్ష్యంగా బాంబ్ అటాక్
పాకిస్తాన్ లోని ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని జామియత్ ఉలేమా ఇస్లాం ఫజల్ రాజకీయ పార్టీ నాయకుడు అబ్దుల్లా నదీమ్ లక్ష్యంగా బాంబ్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడిలో అతనితో పాటూ మరో ముగ్గురు పిల్లలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. బాంబు దాడిలో తీవ్రంగా గాయపడ్డ నదీమ్ ను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎవరు చేశారన్నది ఇంకా తెలియలేదు. దీని బాధ్యత ఇప్పటివరకూ ఎవరూ ప్రకటించలేదు.
ఇకపై ఏం జరిగినా పాకిస్థాన్ ఆర్మీదే బాధ్యత
మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. పాక్ ఆర్మీతో తమ యుద్ధం కొనసాగుతోందని తెలిపింది. ఖైదీల మార్పిడి ప్రతిపాదనకు 48 గంటల డెడ్లైన్ ముగిసిందని, ఇకపై ఏం జరిగినా పాకిస్థాన్ ఆర్మీదే బాధ్యత అంటూ వార్నింగ్ ఇచ్చింది. కాగా, గత నెలలో నౌషెరా జిల్లాలోని దారుల్ ఉలూమ్ హఖ్కాని సెమినరీ జరుగుతుండగా ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో జేయూఐ-ఎస్ నేత మౌలానా హమిదుల్ హఖ్ హుఖ్కాని సహా ఆరుగురు మరణించగా, 15 మంది గాయపడ్డారు. దీనికి ముందు 2023 జనవరి 30న పెషావర్ పోలీస్ లైన్స్ ఏరియాలో జరిగిన బాంబు పేలుడులో 59 మంది మృతి చెందగా, 157 మంది గాయపడ్డారు.