బొగత జలపాతానికి పర్యాటకుల సందడి

Bogatha Jalapatham

హైదరాబాద్‌ః తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో జలపాతం అందాలను మొబైల్‌ ఫోన్ల‌లో చిత్రీకరిస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నిన్న ఆదివారం కావడంతో పర్యాటకుల తాకిడి భారీగానే క‌నిపించింది.

కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో తరలివచ్చిన పర్యాటకులు బొగత జలపాత ప్రాంగణంలో రోజంతా గడిపి విందులు, వినోదాలతో ఆనందం పొందుతున్నారు. బొగత జలపాతాన్ని సందర్శించిన పర్యాటకులు బహుత లోయలో జలకాలాడటం చేశారు.

అయితే, బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతున్న‌ప్ప‌టికీ ఇక్కడ సౌకర్యాలు మాత్రం అంతంత మాత్ర‌మేన‌ని తెలుస్తోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ పర్యాటక కేంద్రం వద్ద సకల సౌకర్యాలు క‌ల్పించాల‌ని సందర్శకులు కోరుతున్నారు.

కాగా, బొగ‌త జ‌ల‌పాతం అందాల‌ను ఆస్వాదించేందుకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఛత్తీస్‌గ‌ఢ్‌, ఏపీ నుండి కూడా పర్యాటకులు క్యూకడుతుంటార‌నే విష‌యం తెలిసిందే.