తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గోశాలలో వందకు పైగా గోవులు చనిపోయాయని సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారంపై రాజకీయాల వేడి రగిలింది. ఈ ఘటనలో అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణలతో వైసీపీ సీనియర్ నేత, తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై స్పందించిన భూమన, తాను భయపడే వ్యక్తినని ఎవరూ అనుకోకూడదని ఘాటుగా హెచ్చరించారు. ఒక్క కేసు కాదు ఇలాంటివి వందలు పెట్టినా, నేను నిలబడేది ధర్మం పక్కనే. ప్రజల పక్షాన నిలవడమే నా ధ్యేయం. అసత్యాలను ప్రశ్నించడమే నా బాధ్యత, అంటూ బహిరంగంగా ప్రకటించారు.

వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు నన్ను ఆపలేవు
తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ భూమన, రాజకీయ ప్రతీకార చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. ఒక్క కేసు కాదు, ఇలాంటివి మరో 100 కేసులు పెట్టుకున్నా తాను భయపడనని అన్నారు. వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననాలు చేస్తే భయపడతాం అనుకుంటే అది మీ భ్రమ మాత్రమేనని చెప్పారు. మీ తప్పులను ఎత్తి చూపినందుకు ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు. వ్యక్తిత్వ హననాలు చేసినా, బెదిరింపులకు దిగినా నేను భయపడను. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నా హక్కు. అది ఎవరికైనా అసహ్యంగా ఉంటే, అది వారి సమస్య, అని అన్నారు.
కూటమిపై విమర్శలు
భూమన తన విమర్శల పరంపరలో అధికార కూటమిపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 నెలల పాలనలోనే ప్రజలు ఈ కూటమిపై నమ్మకం కోల్పోయారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరిచిపోయారు. హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా దేవస్థానాల పాలనను రాజకీయం చేస్తున్నారు, అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని అడ్డం పెట్టుకుని చేసే రాజకీయాలు ప్రజలకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజలు చూస్తున్నారు సమయానికి సరైన తీర్పు ఇస్తారు, అని హెచ్చరించారు.
Read also: KA Paul: చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్