తెలంగాణ మందుబాబులకు షాక్..బీర్ల ధరలు భారీగా పెరగబోతున్నాయి

తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. తెలంగాణ లో మద్యం అమ్మకాలు ఏ రేంజ్ లో జరుగుతాయో తెలియంది కాదు..ఈరోజు ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయంటే దానికి కారణం మద్యం అమ్మకాల ద్వారా వచ్చే డబ్బుతూనే. ఈ సంవత్సరం లిక్కర్ అమ్మకాల ద్వారా రూ.40 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు. గత ఏడాది మద్యం అమ్మకాల ద్వారా రూ.36,493 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది.

గత ఆర్థిక సంవత్సరంలో వరుస ఎన్నికలు ఉండటంతో మద్యం అమ్మకాలకు కలిసొచ్చింది. ఎన్నికలలో మద్యం ఏరులై పారింది. రాజకీయ నాయకులు డబ్బుకు లెక్క చేయక అటు కార్యకర్తలు, ఇటు ఓటర్లకు మద్యం వాళ్ల సొంత డబ్బులు ఖర్చుపెట్టి ఉచితంగా అందించడంతో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే ఈ ఏడాది కూడా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలు బాగానే ఉంటాయని అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో బీర్ల ధరలను భారీగా పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. వచ్చేనెల అంటే సెప్టెంబర్ నుంచి ఒక బీరు ధర.. పది రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బీర్ల ఉత్పత్తి కేంద్రాల(బ్రూవరీలు)కు చెల్లించే ధరలను ప్రభుత్వం రెండేళ్లకోసారి పెంచుతుంది. ఈసారి రూ. 20-25 పెంచాలని బ్రూవరీలు కోరగా, రూ.10-12 వరకూ పెంచాలని సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. బ్రూవరీల నుంచి ప్రభుత్వం ఒక్కో బీరును రూ. 24.08కి కొని, వైన్స్లకు రూ.116.66కి విక్రయిస్తోంది. వినియోగదారుడికి వచ్చే సరికి లైట్ బీరు ధర రూ.150కి చేరుతోంది.