భారత సరిహద్దుకు చేరుకుంటున్న బంగ్లాదేశీయలు

bangladeshis-who-are-reaching-the-indian-border-in-large-numbers

న్యూఢిల్లీ: పొరుగుదేశం బంగ్లాదేశ్ ఇంకా రగులుతూనే వుంది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ కి పారిపోయి వచ్చినప్పటికీ, అక్కడి విద్యార్థులు ఇంకా శాంతించడం లేదు. నిరసనలు, ఆందోళనల మధ్య లూటీలు, దాడులు యథేచ్చగా జరుగుతున్నాయి. కొన్ని వర్గాలకు చెందిన సంస్థలు, వ్యాపార సముదాయాలపై దాడులు కొనసాగుతున్నాయని వార్తలు వినబడుతున్నాయి.

దీంతో తమ దేశంలో ఉంటే ప్రాణాలకు ముప్పు అని భావిస్తున్న వందలాది మంది బంగ్లాదేశీయులు ఆశ్రయం కోరుతూ భారత సరిహద్దుకు చేరుకుంటున్నారు. బంగ్లాదేశ్ లోని పంచగఢ్ జిల్లాలోని ఓ అయిదు జిల్లాలు పశ్చిమ బెంగాల్ లో జల్ పాయిగుడీ సరిహద్దులోనే ఉంటాయి. దీంతో బంగ్లాదేశీయులు జల్ పాయి గుడీ లోని దక్షిణ్ బెరూబారీ గ్రామంలో ఉన్న ఔట్ పోస్టుకు చేరుకున్నారు. ఇనుప కంచె వద్దకు వచ్చిన బంగ్లాదేశీయులు అంతా తమ దేశంలో నెలకొన్న భయానక పరిస్థితులను వివరించి భారత్ లో ఆశ్రయం కల్పించాలని వేడుకున్నారని అక్కడి స్థానికులు వెల్లడించారు. అయితే సరిహద్దు మొత్తం ఇనుప కంచెతో మూసి వేసి ఉండటంతో వాళ్లు భారత్ లోకి ప్రవేశించలేకపోయినట్లు బీఎస్ఎఫ్ దళాలు తెలిపాయి. అయితే బంగ్లా సరిహద్దు బలగాలు వారిని వెనక్కి తీసుకువెళ్లినట్లు తెలిపాయి.

మరో పక్క బంగ్లాదేశ్ లో హింస చేలరేగిన నేపథ్యంలో ఇప్పటికే భారత్ అప్రమత్తమైంది. నాలుగు వేల కిలో మీటర్ల పొడవైన ఆ దేశంతో ఉన్న సరిహద్దులో బీఎస్ఎఫ్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కమాండర్లు క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బీఎస్ఎఫ్ చీఫ్ దల్జీత్ సింగ్ చౌధరి సైతం సరిహద్దు లోని జిల్లాకు చేరుకొని అధికారులతో సమావేశం నిర్వహించారు.