వీరప్పన్‌ వారసుల చేతిలో టీటీడీ పాలన సాగింది: బండి సంజయ్‌

Bandi Sanjay visited Tirumala Srivara today

తిరుమలః కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ..గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. స్వామి వారిపై భక్తి లేని వారు నామాలు పెట్టుకుని… స్వామికి, టీటీడీ ఆస్తులకు పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. ఇతర మతస్తులకు అధికారాన్ని అప్పగించి తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేశారని దుయ్యబట్టారు.

గత ఐదేళ్లు వీరప్పన్ వారసుల చేతిలో టీటీడీ పాలన సాగిందని సంజయ్ అన్నారు. ఎర్రచందనం కొల్లగొట్టి వేల కోట్లను సంపాదించారని చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని… వారిని వదిలి పెట్టబోమని అన్నారు. వేంకటేశ్వరస్వామి వారి దయ, భిక్షతో కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగానని చెప్పారు. కాగా, బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి హోదాలో స్వామి వారిని బండి సంజయ్ దర్శించుకోవడం ఇదే తొలిసారి.