2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ నుండి ప్రముఖ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ‘పద్మభూషణ్’ అవార్డును అందుకున్నారు. ఆయన కళారంగంలో, సామాజిక సేవల రంగంలో చేసిన విశేష కృషికి గాను ఈ గౌరవం లభించింది.
Read Also : KTR Injured : గాయపడ్డ కేటీఆర్..కొద్దీ రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందే
తెలుగు సినిమా రంగానికి చేసిన విశేష సేవలు
తెలుగు సినిమా రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా బాలకృష్ణ సేవలు అందించారు. ఆయన 110కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆయన నటనకు విస్తృతమైన గుర్తింపు లభించడంతో పాటు, ఆయన సమాజానికి చేసిన సేవలు కూడా ప్రత్యేకమైనవి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్గా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి గౌరవాన్ని తీసుకొచ్చారు. ఈ అవార్డు, బాలకృష్ణకు తానే కాదు, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
పద్మభూషణ్ అవార్డు పొందిన మరికొంత మంది ప్రముఖులు
2025 పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం గత జనవరి 25న ప్రకటించింది. ఈసారి మొత్తం 139 మంది ఎంపికయ్యారు. వీరిలో 113 మందికి పద్మశ్రీ, 19 మందికి పద్మభూషణ్, 7 మందికి పద్మవిభూషణ్ అవార్డులు లభించాయి. టాలీవుడ్ నుండి బాలకృష్ణతో పాటు, నటి శోభన కూడా పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్, కన్నడ నటుడు అనంత్ నాగ్, బాలీవుడ్ గాయకుడు అరిజిత్ సింగ్, మరియు దర్శకుడు శేఖర్ కపూర్ వంటి ప్రముఖులు కూడా పద్మ అవార్డులు పొందారు.