తిరువూరులో ఓ గిరిజన మహిళపై దాడి చేసి అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇవాళ పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చారు. కొలికపూడిపై వచ్చిన ఆరోపణలపై అధిష్టానం గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో ఆయన ఇవాళ పార్టీ పెద్దల ముందు హాజరై రాతపూర్వక వివరణ ఇచ్చారు. దీనిపై విచారించి కొలికపూడిపై తదుపరి చర్యల్ని అధిష్టానం ఖరారు చేయబోతోంది. తిరువూరు నియోజకవర్గంలోని ఎ. కొండూరు మండలం గోపాలపురంలో టీడీపీ గ్రామ కార్యదర్శి భూక్యా రాంబాబు ఇంటికి ఈ నెల 11న వెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. ఆయన సోదరుడు అయిన వైసీపీ నేత భూక్యా కృష్ణకు చెందిన భూ వివాదంపై హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కృష్ణ భార్యను సైతం ఇంట్లో దూరి కొట్టి అవమానించారని ప్రత్యర్థులు ఆరోపించారు. దీనిపై టీడీపీ హైకమాండ్ కొలికపూడి వివరణ కోరింది. ఈ వ్యవహారంపై ఇవాళ టీడీపీ క్రమశిక్షణా కమిటీ ముందు హాజరైన కొలికపూడి.. రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చేది వేరని, వాస్తవం వేరని తెలిపారు.
