15న నా స్థానంలో అతిషి జాతీయ జెండాను ఎగరవేస్తారు: ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ
న్యూఢిల్లీ: ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో తనకు బదులుగా మంత్రి అతిషి పాల్గొంటారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సీఎం లేఖ రాశారు. ఆగస్టు 15న తన స్థానంలో అతిషి జాతీయ జెండాను ఎగరవేస్తారని లేఖలో తెలిపారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా వెల్లడించింది.
ఏటా ఆగస్టు 15 వేడుకల్ని ఢిల్లీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. ఛత్రసాల్ స్టేడియంలో జరిగే ఈ వేడుకల్లో కేజ్రీ జాతీయ జెండాను ఎగరవేసి.. సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే, ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీని ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం సీఎంకు లేదు. తన స్థానంలో అతిషి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటుందని జైలు నుంచి ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ రాసినట్లు ఆప్ వెల్లడించింది.