రైతుల పొలాల్లో..సర్వే రాళ్లపై జగన్‌ ఫొటోలు..విడ్డూరం: అచ్చెన్నాయుడు

tdp-atchannaidu

అమరావతి: సమాధి రాళ్లపై ఫొటోలు వేసుకున్నట్లుగా సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు వేయించారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రైతుల పొలాల్లో సర్వే రాళ్లపై జగన్ తన ఫొటోలు వేయించుకోవడం విడ్డూరమన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంత్రి ట్వీట్ చేశారు. ‘రైతు తన పొలంలో దిష్టిబొమ్మ పెట్టడానికి ఒప్పుకుంటాడు కానీ పొలం హక్కు పుస్తకాల మీద దిష్టిబొమ్మ పెడితే ఊరుకోడు.. సమాధి రాళ్ల మీద ఫోటో వేసుకున్నట్లు రైతులందరి పొలాల్లో సర్వే రాళ్లపై నీ (జగన్) ఫోటోలు వేయించావు. ప్రజల సొమ్ము రూ.650 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేసి పబ్లిసిటీ స్టంట్లు చేసినందుకే నిన్ను ఇంటికి పంపించారు.’ అంటూ జగన్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

‘ఫొటోల పిచ్చి ఖరీదు రూ.700 కోట్లు’ అని రాష్ట్ర ప్రభుత్వం నిగ్గు తేల్చిందని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారు. గ్రానైట్ రాళ్లపై జగన్ ఫొటోల కోసం వైసీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు ఇది అంటూ ఆ కథనం పేర్కొంది. నాటి వైసీపీ ప్రభుత్వం చేష్టలకు అధికారులు దాసోహం అన్నారని విమర్శించింది. అధికారులు ఏమాత్రం అడ్డు చెప్పకుండా నిధులు ఖర్చు చేశారని ఆరోపించింది. దీనిని అచ్చెన్నాయుడు పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.