మహాకుంభమేళా వేడుకల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ భక్తులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రాజమండ్రి ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఫిబ్రవరి 18న ప్రత్యేక బస్సు ప్రారంభం కానుంది. ఈ బస్సు పలు పుణ్యక్షేత్రాల మీదుగా ప్రయాణించి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో భాగస్వామ్యం కల్పించనుంది. మొత్తం 11 రోజుల యాత్రలో 13 పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంటుంది.
ప్రత్యేక బస్సు భువనేశ్వర్లోని లింగరాజస్వామి దేవాలయం, పూరీ జగన్నాధస్వామి ఆలయం, కోణార్క్ సూర్యనారాయణ ఆలయం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించి, ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు చేరుకుంటుంది. అక్కడ పుష్కర స్నానాలు ఆచరించి, త్రివేణి సంగమం, కళ్యాణి దేవి ఆలయ దర్శనాలు జరుగుతాయి.

అనంతరం కాశీలో విశ్వేశ్వరుడి జ్యోతిర్లింగం, అన్నపూర్ణ దేవి ఆలయం, విశాలక్షి శక్తిపీఠం దర్శనాలు కల్పించబడతాయి. అయోధ్య, సీతామడిలాంటి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించనున్నారు. చివరగా గయ, బుద్ధగయ, అరసవల్లి, అన్నవరం ఆలయాలను సందర్శించి రాజమండ్రికి తిరిగి చేరుకుంటారు.
ఈ ప్యాకేజీలో భాగంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందించబడుతుంది. ఈ ప్రత్యేక యాత్ర టికెట్ ధర రూ.12,800గా నిర్ణయించారు. బస్సు సూపర్ లగ్జరీ విధానంలో ఉండగా, రూమ్ చార్జీలు అదనంగా ఉంటాయని అధికారులు తెలిపారు.
మహాశివరాత్రి పర్వదినం రోజున కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న భక్తులు ముందుగా రాజమండ్రి ఆర్టీసీ డిపోను సంప్రదించాలని సూచించారు. ఈ ఆఫర్ భక్తులకు ప్రత్యేక అనుభూతిని అందించనుంది.