సీఈసీ నియామకాన్ని తప్పుపట్టిన రాహుల్గాంధీ
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ను అర్ధరాత్రి నియమించడంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. కొత్త సీఈసీ ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించారు. తదుపరి ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఎంపిక చేసే కమిటీ సమావేశంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఉండాలని తెలిపినట్లు చెప్పారు. సీజేఐను తొలగించడంపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు తన అసమ్మతిని తెలియజేసినట్లు చెప్పారు.

ఎన్నికల ప్రక్రియపై కోట్లాది మందికి అనుమానాలు కలుగుతున్నాయి
ఇప్పుడేమో అర్ధరాత్రి కొత్త సీఈసీని ప్రకటించేశారు. దీంతో కోట్లాది మంది ఓటర్లకు తీవ్ర అనుమానాలు మొదలయ్యాయని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ముగ్గురు సభ్యుల ప్యానెల్ కమిటీలో తాను, ప్రధాని మోడీ, అమిత్ షా ఉన్నారని.. ఇప్పుడేమో తనకు తెలియకుండా అర్ధరాత్రి కొత్త సీఈసీని ప్రకటించేశారని ఆరోపించారు. ఈ చర్య మర్యాదలేనిదిగా ఉందని పేర్కొన్నారు. ఈ కమిటీ కూర్పుపై సుప్రీంకోర్టులో మరికొన్ని గంటల్లో విచారణ ఉండగా కొత్త సీఈసీని ఎలా ప్రకటిస్తారని రాహుల్ గాంధీ నిలదీశారు.
కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి
ఇక ప్రస్తుత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ స్థానంలో జ్ఞానేష్ కుమార్ను కేంద్రం ప్రకటించింది. రాజీవ్ కుమార్ మంగళవారం పదవీ విరమణ చేశారు. సోమవారం అర్ధరాత్రి జ్ఞానేష్ కుమార్ పేరును కేంద్రం ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించింది.