తిరుపతి నుంచి కోయంబత్తూర్ వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ టూరిజం బస్సులో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపణలు వెలుగు చూశాయి. ఈ దారుణం ఏప్రిల్ 14న జరిగిందని బాలిక తండ్రి పేర్కొన్నారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బస్సులో ప్రయాణించిన సమయంలో కొన్ని అనుమానాస్పద విషయాలు చూశానని బాధితురాలి తండ్రి వివరించారు. బస్సు సిబ్బంది వారి పరిచయమున్న వ్యక్తులను అనధికారికంగా ఎక్కించారని తెలిపారు. అంతే కాదు, ప్రయాణికుల భద్రత కోసం ఉండే సీసీ కెమెరాలు కూడా పని చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై బాధిత తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.వెంటనే న్యాయం జరగాలని కోరుతూ తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే ఏపీ టూరిజం శాఖ ఉన్నతాధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ప్రభుత్వం దృష్టికి వెళ్లిన వెంటనే టూరిజం శాఖ అధికారులు స్పందించారు.ఘటనపై ప్రాథమిక విచారణ మొదలుపెట్టారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్లు, ఇతర సిబ్బంది పై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.ఇలాంటి ఘటనలు పర్యాటక రంగంలో నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి.
ప్రయాణికుల భద్రత అనేది ప్రథమ కర్తవ్యంగా ఉండాల్సిన పరిస్థితుల్లో, అలాంటి నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారుతుంది.ఈ ఘటనను పరిశీలిస్తున్న నెటిజన్లు, ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సీసీ టీవీలు పనిచేయకపోవడం, అనధికారిక ప్రయాణికుల ఎక్కింపు వంటి అంశాలు ఇంకా భయాందోళనలు కలిగిస్తున్నాయి.పర్యాటక శాఖ మాత్రం బాధితురాలికి న్యాయం జరిగేలా వ్యవహరిస్తుందని చెబుతోంది. ఈ కేసు ద్వారా భవిష్యత్తులో ఇటువంటి దుస్థితులు రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు.ప్రతి ప్రయాణికుడి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన సమయం ఇది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఈ వ్యవహారాన్ని ప్రజలు మరచిపోరు.
Read Also : Veerayya Chowdary : వీరయ్య చౌదరి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు…