ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 23న విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 6,14,459 మంది విద్యార్థులలో 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించగా, ఉత్తీర్ణత శాతం 81.14గా నమోదైంది. ఉత్తీర్ణత శాతంలో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలవగా, అల్లూరి సీతారామరాజు జిల్లా అత్యల్ప స్థాయిలో ఉంది. ఈ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు, తక్కువ మార్కులు వచ్చిన వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వారికి రెండో అవకాశంగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది.

రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ అవకాశాలు
పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు తమ సమాధాన పత్రాలను తిరిగి పరిశీలించుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. రీ కౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 24 నుండి మే 1వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్కూల్ లాగిన్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్ధులు రీకౌంటింగ్కు రూ.500, రీ వెరిఫికేషన్కు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా విద్యార్థులు తమ మార్కుల్లో తేడాలు ఉన్నట్లయితే దాన్ని సవరించుకునే అవకాశాన్ని పొందవచ్చు. ఇది ఎంతోమంది విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశాన్ని కల్పిస్తుంది.
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
పాఠశాల విద్యా శాఖ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం, 2025 మే 19 నుండి మే 28 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన టైమ్ టేబుల్ విడుదల చేసింది. విద్యార్థులు ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని, ఆలస్య రుసుముతో జూన్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కాగా తాజాగా విడుదలైన ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైన సంగతి తెలిసిందే. మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఫలితాల్లో 93.90 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలవగా అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ ఇదే
మే 19- ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1
మే 20- సెకండ్ ల్యాంగ్వేజ్
మే 21- ఇంగ్లీష్
మే 22- గణితం
మే 23- భౌతిక శాస్త్రం
మే 24- జీవ శాస్త్రం
మే 26- సామాజిక అధ్యయనాలు
మే 27- ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 2, OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ I
మే 28- OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2, SSC ఒకేషనల్ కోర్సు
ఓపెన్ స్కూల్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఇందులో పదో తరగతిలో 26,679 మంది పరీక్షలు రాయగా, 37.93% ఉత్తీర్ణత నమోదు కాగా, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 53.12% విజయం సాధించారు. ఓపెన్ స్కూల్ విద్యార్థులకు కూడా మే 5వ తేదీ వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేసుకోవచ్చని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. ప్రతి సబ్జెక్టు రీకౌంటింగ్కు రూ.200, రీ వెరిఫికేషన్ కు రూ.రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. పది, ఇంటర్ మే 2025 పరీక్షలు రెగ్యులర్ పదో తరగతి పరీక్షలతోపాటు కలిపి నిర్వహించనున్నట్టు తెలిపారు.
Read also: Chiranjeevi: చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చిరంజీవి