ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో కీలక ముందడుగు పడింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా, సచివాలయ టవర్ల నిర్మాణానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ, కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (CRDA) బుధవారం భారీ టెండర్లను విడుదల చేసింది. సచివాలయం, హెచ్వోడీ కార్యాలయాల నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ టెండర్లు ఆహ్వానించారు.

నాలుగు సచివాలయ టవర్లు – ఒక హెచ్వోడీ టవర్
ఈసారి జారీ చేసిన టెండర్లలో ముఖ్యంగా- సచివాలయం కోసం నాలుగు టవర్లు నిర్మించనున్నారు. టవర్లు 1 , 2 కోసం రూ.1,897 కోట్ల వ్యయంతో, టవర్లు 3 ,4 కోసం రూ.1,664 కోట్ల వ్యయంతో హెచ్వోడీ కార్యాలయాల కోసం మరో ప్రత్యేక టవర్ నిర్మాణానికి కూడా టెండర్ పిలిచారు. ఇది రూ.1,126 కోట్ల వ్యయంతో చేపడతారు. ఈ ఐదు టవర్ల నిర్మాణానికి కలిపి రూ.4,668 కోట్ల వ్యయం కేటాయించారు. ఇది అమరావతి అభివృద్ధిలో ఎంతో ప్రతిష్టాత్మకమైన దశగా భావిస్తున్నారు అధికారులు. ఈ టెండర్లకు సంబంధించి టెక్నికల్ బిడ్లను మే 1, 2025న సీఆర్డీఏ పరిశీలించనుంది. అర్హత కలిగిన సంస్థలు ఇందులో పాల్గొనవచ్చు. ఇదే సమయంలో నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించిన సమయ రేఖలు కూడా ఖరారు చేయనున్నారు. సచివాలయ నాలుగు టవర్లు 40 అంతస్తులతో నిర్మాణం జరగనుంది. హెచ్వోడీ కార్యాలయ టవర్ ఇది 45 అంతస్తుల అధిక పొడవు కలిగిన భవనంగా నిర్మించనున్నారు. ఈ టవర్లు నిర్మితమైన తరువాత, అమరావతిలోని అధికారిక కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచే అవకాశముంది. ప్రభుత్వ శాఖలన్నీ ఒకేచోట సమీకరించి సమర్థవంతమైన పరిపాలనను అందించేందుకు ఈ నిర్మాణం దోహదపడనుంది. సీఆర్డీఏ తెలిపిన ప్రకారం, ఈ టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రెండున్నర సంవత్సరాల గడువు కేటాయించారు. అనుకున్న ప్రణాళికల ప్రకారం పనులు జరుగితే, వచ్చే మూడు సంవత్సరాల్లో అమరావతిలో సచివాలయ నిర్మాణం పూర్తవుతుందని అంచనా.
Read also: TDP : టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కమిటీ నియామకం