తుంగభద్ర డ్యామ్ను పరిశీలించిన ఏపీ మంత్రులు
తుంగభద్ర: నిర్వహణ లోపం కారణంగానే ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ కోసం నిధులు వెచ్చించలేదని విమర్శించారు. తుంగభద్ర డ్యామ్ను మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి ఆయన ఈ ఉదయం పరిశీలించారు. సాధ్యమైనంత తర్వలో స్టాప్లాగ్ గేటు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై నిపుణులతో చర్చిస్తామని మంత్రి పయ్యావుల అన్నారు. డ్యామ్ పటిష్ఠత, మరమ్మతులపై అధికారులతో మంత్రులు సమీక్షించనున్నారు.
తుంగభద్ర ప్రాజెక్టులో వరద ఉద్ధృతికి 19వ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో మూడు రోజులుగా లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా వెళ్తోంది. వరదను అడ్డుకునేందుకు తాత్కాలిక గేటు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నేడు తుంగభద్ర డ్యామ్ వద్దకు కర్ణాటక సీఎం రానున్నారు.