ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున టీచర్ ఉద్యోగాల భర్తీకి సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టులకు సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ 20, 2025న విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉద్యోగార్థులు ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాన్ని కలలుగా కంటున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారింది.
మే 30న హాల్ టికెట్స్ విడుదల
పరీక్షల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ కూడా అధికారికంగా ప్రకటించారు. అభ్యర్థులకు హాల్ టికెట్లు మే 30న విడుదల కానున్నాయి. డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు. పరీక్ష ముగిసిన రెండు రోజుల తరువాత ప్రాథమిక కీ విడుదల కానుంది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను కీ విడుదలైన 7 రోజులలోగా సమర్పించవచ్చు. ఇది పరీక్షా పారదర్శకతను పెంచేందుకు తీసుకున్న మంచి చర్యగా భావించబడుతోంది.
జులై మూడో వారంలో ఫైనల్ కీ విడుదల
చివరిగా అభ్యంతరాలపై పరిశీలన అనంతరం ఫైనల్ కీ జులై మూడో వారంలో విడుదల కానుంది. అదే నెల చివరి వారంలో మెరిట్ లిస్టు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ద్వారా వేల మంది అభ్యర్థులకు రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. కాబట్టి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే సిద్ధమై సన్నాహాలు ప్రారంభించాలి.