చంద్రబాబు పుట్టినరోజు సందర్బంగా నిరుద్యోగులకు సర్కార్ శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మధురమైన కానుకను అందించింది. ఎన్నాళ్లనుండో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఎట్టకేలకు ఆశాజనకమైన వార్తను ప్రకటించింది. ఏప్రిల్ 20న ఆదివారం ఉదయం 10 గంటలకు పాఠశాల విద్యాశాఖ అధికారులు మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ప్రిన్సిపల్ వంటి విభిన్న పోస్టులకు ఈ నియామక ప్రక్రియ జరగనుంది.
16,347 టీచర్ పోస్టులకు మేగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఈ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ఏప్రిల్ 20నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.750గా నిర్ణయించబడింది. గత డీఎస్సీలో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. కొత్తగా ఇతర సబ్జెక్టులకు దరఖాస్తు చేయాలంటే మాత్రం అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయోపరిమితి కూడా 44 ఏళ్ల వరకు పెంచి మరింతగా అవకాశాలను విస్తరించింది కూటమి సర్కార్. ఇది చాలామందికి స్వర్ణావకాశం.
మెగా డీఎస్సీ పరీక్షలు, హాల్ టికెట్లు, ఆన్సర్ కీ వివరాలు
మే 30 నుంచి హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. జూన్ 6 నుంచి జూలై 6 వరకు నెల రోజులపాటు రెండు సెషన్లలో ఆన్లైన్ ద్వారా డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ అభ్యర్థులకు ఇంగ్లీష్ నైపుణ్య పరీక్ష పేపర్-1గా ఉంటుంది. ఈ పరీక్షలో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు కనీసం 50 మార్కులు సాధించాలి. అర్హత సాధించిన తర్వాతే పేపర్-2ను లెక్కించనున్నారు. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు టెట్ వెయిటేజీ 20 శాతం వర్తింపజేస్తారు. మాక్ టెస్టులు మే 20 నుంచి అందుబాటులో ఉంటాయి. ప్రతి పరీక్ష అనంతరం రెండో రోజే ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదల చేస్తారు. అభ్యంతరాలు స్వీకరించి, తుది ఆన్సర్ కీ ప్రకటించిన తర్వాత వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించనున్నారు.
నిరుద్యోగ యువతలో ఆనందోత్సాహం
కూటమి సర్కార్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు నిరుద్యోగులు గర్వంగా, ఆనందంగా స్పందించారు. ఇప్పటివరకు ఉపాధ్యాయ నియామక ప్రక్రియ జాప్యానికి గురై ఉండగా, ఇప్పుడు కేవలం 45 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇది ఉద్యోగార్థులకు ఎంతో గొప్ప అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ ప్రకటనను పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


READ ALSO: Chandrababu Naidu: చంద్రబాబుకు జన్మదినం సందర్భంగా గవర్నర్ నజీర్ శుభాకాంక్షలు