ఏపీలో ఆరోజు నుంచి మహిళలకు ఫ్రీ బస్..?

రాష్ట్రంలో కీలక హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది. కాగా అదే రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ను సైతం ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలు విధానంపై అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 16న మంత్రివర్గం సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి.. ఈ పథకం అమలు తీరు పైన ఆర్టీసీ అధికారుల నుంచి ప్రభుత్వం నివేదికలు కోరింది. నిత్యం ఎంతమంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు.. ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత మేర భారం పడుతుంది.. ఈ ఉచిత బస్సు అమలులో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి.. ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యల పైనా పూర్తి స్థాయిలో అధికారులు నివేదికలు సిద్ధం చేశారు.