ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర పూరితంగా పెన్షనర్ల జాబితా నుంచి పెన్షనర్ల పేర్లను తొలగిస్తోందనీ, పేదలకు అన్యాయం చేస్తోందని ప్రతిపక్ష వైసీపీ భగ్గుమంటోంది. సోషల్ మీడియాలో విపరీతంగా ఇలాంటి ప్రచారం జరుగుతోంది. దీన్ని ఇలాగే వదిలేస్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనుకున్న ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పెన్షన్ల అంశంలో ప్రజలకు ఉన్న సందేహాలను తీర్చుతూ.. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి క్లారిటీ ఇచ్చారు. పెన్షనర్ల జాబితా నుంచి పేర్లను తొలగించట్లేదన్న మంత్రి.. దివ్యాంగులకు ప్రతి రెండేళ్లకు ఓసారి జరుగుతున్నట్లే.. వైకల్య నిర్ధారణ జరుగుతోందని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక డాక్టర్ల బృందాలు.. వైకల్యాన్ని నిర్ధారిస్తున్నాయని వివరించారు. దీని ద్వారా.. వైకల్య స్థాయి ఎంత ఉంది అనేది మరోసారి స్పష్టం అవుతుందని మంత్రి చెబుతున్నారు.

దివ్యాంగుల పేర్లను తొలగిస్తున్నామనే వార్తలు నిజం కాదన్న మంత్రి.. దివ్యాంగులందరికీ కచ్చితంగా పెన్షన్ ఇస్తామని తెలిపారు. సాధారణ దివ్యాంగులకు నెలకు రూ.6,000, పూర్తి స్థాయి వైకల్యం వచ్చి, మంచానికే పరిమితం అయినవారికి నెలకు రూ.15,000 చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ పెన్షన్లు వస్తాయని మంత్రి క్లారిటీ ఇచ్చారు.
మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్లో అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించట్లేదు అని ఎక్కడా చెప్పలేదు. అంటే.. ఈసారి ఇచ్చే పెన్షన్లలో.. అనర్హులైన వారి పేర్లను కచ్చితంగా తొలగిస్తారు. అందులో తప్పేమీ లేదు. పెన్షన్లను అర్హులు మాత్రమే పొందాలి. అనర్హులు పొందితే, అది చట్ట విరుద్ధం అవుతుంది. ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బును, వృథాగా ఖర్చు పెట్టినట్లు అవుతుంది. అందువల్ల పెన్షనర్లలో అనర్హుల పేర్లను తొలగించడం సరైన విధానమే అవుతుంది.