ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు లేనివారికి కొత్త ఆశ కలిగించే వార్తను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మే 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. కేవలం కొత్త కార్డులకే కాకుండా, ఇప్పటికే ఉన్న కార్డులలో సభ్యుల చేరిక, తొలగింపు, చిరునామా మార్పు, విభజన వంటి సవరణలకు కూడా అవకాశం కల్పించనున్నారు. ఇప్పటివరకు 3.28 లక్షల సవరణ దరఖాస్తులు అందాయని, వాటిని పూర్తిగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
నూతన స్మార్ట్ రేషన్ కార్డుల వివరాలు వెల్లడి
ఈ సందర్భంగా నూతన స్మార్ట్ రేషన్ కార్డుల వివరాలు వెల్లడించారు. ఈ స్మార్ట్ కార్డులు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ సెక్యూరిటీ ఫీచర్తో రూపొందించబడ్డాయి. మునుపటి ప్రభుత్వాల మాదిరిగా కార్డులపై నాయకుల ఫోటోలను చూపించకుండా, కేవలం అధికారిక ప్రభుత్వ చిహ్నంతో మాత్రమే ఈ కార్డులు అందజేయబడతాయి. కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు స్పష్టంగా కనిపించేలా ఉండడంతో పాటు, క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా గత ఆరు నెలల రేషన్ వినియోగ వివరాలు తెలుసుకోవచ్చు.
అర్హులైన పౌరులు తమ గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
ఈ ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగనుండగా, అర్హులైన పౌరులు తమ గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జూన్ నుంచి కొత్త కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని, ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మరల దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. మెరుగైన సేవల కోసం ఈ నెల 12 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించనున్నారు. అంతేకాకుండా, దేశం లోని ఏ ప్రాంతంలోనైనా రేషన్ సరుకులు పొందేందుకు సౌకర్యం కల్పించామని మంత్రి గుర్తుచేశారు.
Read Also : Shashi Tharoor : సమావేశం ఫలితంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ విశ్లేషణ