బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయండి – అమిత్ షా తో సీఎం చంద్రబాబు

ఈనెల 23న పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక సాయం ప్రకటించాలని కేంద్రమంత్రి అమిత్ షాను ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. నిన్న ఆయన ఢిల్లీలో షాతో భేటీ అయ్యారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ధ్వంసమైన రోడ్లు బాగు చేసేందుకు చేయూతనిచ్చి, కొత్త జాతీయ రహదారులు, రైలు మార్గాలు మంజూరు చేయాలని సీఎం విన్నవించారు.

గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతలా దిగజారిందో అమిత్ షాకు వివరించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకు విడుదల చేసిన 4 శ్వేతపత్రాలపై ఆయనతో చర్చించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ అసమర్థత, అవినీతి రాష్ట్రానికి తీరని నష్టాన్ని కలిగించాయని ట్వీట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతాయని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు.