ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పారిశ్రామిక ప్రాజెక్టు రానున్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ రంగంలో కీలక పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు అల్యూమినియం పరిశ్రమలో అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్రాజెక్టు ఏర్పాటుకి అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద మైనింగ్ సంస్థ రియో టింటో, భారతీయ కంపెనీ ఏఎంజీ మెటల్స్ అండ్ మెటీరియల్స్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇది మన దేశంలో లోకార్బన్ అల్యూమినియం ఉత్పత్తికి దోహదపడనుంది. ఈ సంస్థను గ్రీన్కో, ఏఎం గ్రీన్ సంస్థలు కలసి స్థాపించాయి.
రియో టింటో పదేళ్ల తర్వాత మళ్లీ భారత్ మార్కెట్లోకి
ఈ ప్రాజెక్టు ద్వారా రియో టింటో పదేళ్ల తర్వాత మళ్లీ భారత్ మార్కెట్లోకి అడుగుపెడుతుంది. ప్రతిపాదిత అల్యూమినియం ప్లాంట్లో సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల ప్రైమరీ అల్యూమినియం, 2 మిలియన్ టన్నుల అల్యూమినా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గాలి, సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారంగా ఈ ఉత్పత్తి కొనసాగనుంది. తొలి దశలోనే 5 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న ప్లాంట్ను నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీని ప్రధాన కేంద్రంగా ఎంచుకునే అవకాశాలపై పరిశ్రమ వర్గాలు దృష్టి సారించాయి. ఓ పోర్టు సమీపంలో ప్లాంట్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.42 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్ల వరకూ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

భారత్ ఇప్పటికే అల్యూమినియం ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానం
అల్యూమినియం ఉత్పత్తికి గ్లోబల్ మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్నందున, ఈ ప్రాజెక్టు వ్యాపారపరంగానూ కీలకం కానుంది. తేలికగా ఉండటం, రీసైక్లింగ్కు అనువుగా ఉండటం వలన ఇది ఆటోమొబైల్, నిర్మాణ రంగాల్లో విస్తృతంగా వాడబడుతుంది. భారత్ ఇప్పటికే అల్యూమినియం ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానం లో ఉంది. ఇదిలా ఉండగా, గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసినట్లు అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు శంకుస్థాపనతో నిరూపితమైంది. అలాగే బీపీసీఎల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి ప్రాజెక్టులు కూడా రాష్ట్రానికి వచ్చే దశలో ఉన్నాయని అంచనా. మొత్తంగా చూస్తే, ఈ ప్రాజెక్టు అమలు ద్వారా ఏపీ పారిశ్రామిక రంగానికి నూతన శక్తినివ్వనుంది.