తెలంగాణ కు మరో తూఫాన్ హెచ్చరిక

ఇప్పటికే వాయుగుండం కారణంగా నాల్గు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాలకు ఎక్కడిక్కడే చెరువులు , వాగులు తెగిపోయి జన జీవనం అస్తవేస్తంగా మారింది. ఎప్పుడు ఈ వర్షాలు తగ్గుతాయో అని రాష్ట్ర ప్రజలు అంత మాట్లాడుకుంటుండగా..ఇప్పుడు మరో తూఫాన్ హెచ్చరిక రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది.

ఈ నెల 5 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని వాయువ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రుతుపవన ద్రోణి జైసల్మేర్‌, రైసేన్‌, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలోనున్న వాయుగుండం కేంద్రం గుండా పొరుగున ఉన్న తెలంగాణ, మచిలీపట్నం మీదుగా వెళ్తుందని.. ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉందని పేర్కొంది. సోమవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వానలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.