హైదరాబాద్‌లో మరో క్రికెట్‌ స్టేడియం: సీఎం రేవంత్‌

Another cricket stadium in Hyderabad: CM Revanth Reddy

హైదరాబాద్‌: తెలంగాణలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఒక స్టేడియంపై ఏర్పాటుపై చర్చలు జరిపినట్టు తెలిపారు. కాగా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో నియామక బిల్లుపై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. మా ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. గతంలో లేని విధంగా రూ.361 కోట్లను స్పోర్ట్స్ కోసం కేటాయించాడం జరిగింది. ఇంటర్ పాసైన భారత క్రికెటర్ సిరాజ్‌కు ఉద్యోగం ఇస్తున్నాం. బాక్సర్ నిఖత్ జరీన్‌కు కూడా గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నామన్నారు. చదువులోనే కాదు ఆటల్లో రాణించినా మంచి భవిష్యత్తు ఉంటుందని మా ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు. చదువులోనే కాదు.. క్రీడల్లోరాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుంది. కుటుంబ గౌరవం పెరుగుతుంది.

ఇక, వచ్చే సమావేశాల్లో స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామన్నారు. వివిధ రాష్ట్రాల పాలసీలు అధ్యయనం చేసి బెస్ట్ పాలసీని తీసుకొస్తాం. హర్యానాలో అత్యధికంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. స్పోర్ట్స్ పాలసీ కోసం ఎవరు ఏ సలహాలు ఇచ్చినా స్వీకరిస్తాం. హైదరాబాద్‌లో గతంలో నిర్మించిన స్టేడియాలు ప్రైవేట్, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యాయి. వీటన్నింటినీ అప్ గ్రేడ్ చేసి విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలనుకుంటుంది. అందుకు మీ అందరి మద్దతు కోరుతున్నా. మండలానికి ఒక మినీ స్టేడియం ఏర్పాటుపై ఆలోచిస్తున్నామన్నారు. బీసీసీఐతో ప్రాథమిక చర్చలు జరిపామన్నారు. బ్యాగరి కంచెలో అంతర్జాతీయ స్టేడియానికి కూడా స్థలం కేటాయిస్తామన్నారు. ఇప్పటికే స్టేడియం నిర్మించాలని బీసీసీఐని కోరినట్టు చెప్పుకొచ్చారు. క్రీడాకారులకు కచ్చితంగా ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.