ఏపీలో నేడు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

Another 75 anna canteens will start today in AP
Another 75 anna canteens will start today in AP

అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గతంలో మూతపడిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తోంది.. ఆగస్టు 15వ తేదీన తొలి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించిన చంద్రబాబుసర్కార్‌.. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధమైంది.. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రెండో విడత అన్న క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. సెక్రటేరీయేట్ వద్దనున్న అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.ఇక, రాష్ట్రవ్యాప్తంగా.. వివిధ ప్రాంతాల్లో మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అన్న క్యాంటీన్ల ద్వారా కేవలం రూ. 5కే టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా అందిస్తున్న విషయం తెలిసిందే.. వారంలో ఆదివారం మినహా వారంలోని మిగతా ఆరు రోజులు అన్న క్యాంటీన్లు అందుబాటులో ఉంచుతోంది ప్రభుత్వం.. ప్రతీ రోజు ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు అన్న క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్.. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న భోజనం.. రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు డిన్నర్ అందుబాటులో ఉంచుతున్నారు.. ఇక, సోమవారం నుంచి శనివారం వరకూ రోజు ఉదయం టిఫిన్ కింద ఇడ్లీ – చట్నీ లేదా పొడి, సాంబార్ అందిస్తుండగా.. సోమ, గురువారాల్లో ఇడ్లీతో పాటుగా పూరీ కుర్మా అందుబాటులో పెడుతున్నారు.. మంగళ, శుక్రవారాల్లో ఉప్మా-చట్నీ, బుధ, శనివారాల్లో పొంగల్- చట్నీ టిఫిన్‌గా అందిస్తున్నారు.