ఆంధ్రప్రదేశ్లో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు మరియు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని, వేసవిలో వాతావరణంలో అస్థిరతలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.
అధిక ఉష్ణోగ్రతలు
గురువారం (మే 1) మరియు శుక్రవారం (మే 2) రోజుల్లో ఉష్ణోగ్రతలు 40°C నుంచి 42°C మధ్యగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నంద్యాల, కర్నూలు, చిత్తూరు, తిరుపతి వంటి రాయలసీమ జిల్లాల్లో వేడి తీవ్రత మరింత అధికంగా ఉండనుందని వెల్లడించింది. ఇదే సమయంలో వానల సమయం లేకపోయినా, వడదెబ్బల ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉపరితల ఆవర్తన ప్రభావం.. పిడుగులతో కూడిన వర్షాలు
ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో వాతావరణం అస్థిరంగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు జిల్లాల్లో కురిసే సూచనలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, గుంటూరు, కర్నూలు, చిత్తూరు వంటి జిల్లాల్లో మేఘావృత వాతావరణం కనిపించే అవకాశం ఉంది.
జిల్లాల వారీగా వర్ష సూచనలు:
మే 1, గురువారం:
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. కాకినాడ, తూర్పు-పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, తిరుపతి తదితర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కనిపించే అవకాశం.
మే 2, శుక్రవారం:
ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం,పార్వతీపురంమన్యం, కాకినాడలో భారీ వర్షాలు కురిసే అవకాశముండగా, మిగిలిన జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశముంది.
మే 3 & 4 (శని & ఆదివారాలు):
రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృత వాతావరణం కొనసాగనుంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటల వరకూ అనకాపల్లి జిల్లా దార్లపూడిలో అత్యధికంగా 66 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఎస్.రాయవరంలో 59 మిమీ, అచ్యుతాపురంలో 55 మిమీ, సాలపువానిపాలెంలో 51 మిమీ, కొప్పాకలో 47 మిమీ వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా అనుమలవీడులో 44 మిమీ వర్షం నమోదైంది. మొత్తం 24 ప్రాంతాల్లో 30 మిమీకి పైగా వర్షపాతం నమోదయ్యింది. బుధవారం నంద్యాల జిల్లా దోర్నిపాడులో 42.7°C, వైఎస్సార్ జిల్లా అట్లూరు, కర్నూలులో 41.8°C, తిరుపతి జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లా తవణంపల్లె 41.7°C, అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట, ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో 41.5°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Read also: Amaravati: అమరావతి రీ లాంచ్ కార్యక్రమానికి జగన్ను ఆహ్వానించిన కూటమి