ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్ర విశ్వకళాపరిషత్ భారత దేశంలో ఉన్న గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఒకటి.ఏప్రిల్ 26తో 99 ఏళ్లు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన అతి కొద్ది వర్సిటీల జాబితాలో చేరింది. పేద, మధ్య తరగతి విద్యార్థులెందరికో మెరుగైన విద్య అందించింది. ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకుంది. దేశ, విదేశాల్లో ఎన్నో కీలక విభాగాల్లో ఏయూ పూర్వ విద్యార్థులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ రోజు (శనివారం) నుంచి ఏయూ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.జమీందార్లు, స్థానికుల సహకారంతో 1913 మే 26న బాపట్ల టౌన్ హాలులో నిర్వహించిన ఆంధ్ర మహాసభకు విశాఖకు చెందిన భయ్యా నరసింహశర్మ అధ్యక్షత వహించారు. ఆ సభలోనే కొందరు తెలుగు ప్రజలకు విశ్వవిద్యాలయం ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా అప్పటి మద్రాస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న అన్నెపు పరశురాం పాత్రో వర్సిటీ ఏర్పాటుకు కృషి చేశారు. 1926 ఏప్రిల్ 26న తొలుత విజయవాడలో వర్సిటీని ఏర్పాటు చేశారు. వర్సిటీకి స్థలం, నిధులు సమకూర్చుతామని విశాఖకు చెందిన పలువురు హామీ ఇవ్వడంతో 1930 సెప్టెంబరులో ఇక్కడికి తరలించారు. అప్పటికే ఉపకులపతిగా ఉన్న సర్ సీఆర్ రెడ్డి(సర్ కట్టమంచి రామలింగారెడ్డి) ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించారు. విజయనగరం, కురుపాం, జయపురం జమీందార్లతోపాటు నగరానికి చెందిన కొందరి సహకారంతో ఏయూ ఏర్పడింది.
పూర్వ విద్యార్థులే
సర్ కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ వీఎస్ కృష్ణ తదితరులు వర్సిటీకి ఉపకులపతులుగా పని చేశారు. సర్ సీవీ రామన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇక్కడ పాఠాలు బోధించారు. సర్ సీవీ రామన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య పని చేస్తున్న కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏయూను సందర్శించారు. పూర్వ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు యర్రన్నాయుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రామస్వామి తదితరులు ఏయూ పూర్వ విద్యార్థులే.పూర్వ విద్యార్థుల్లో ఐదుగురు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు, ఇద్దరు పద్మవిభూషణ్, ఒకరు పద్మభూషణ్, ఐదుగురు పద్మశ్రీ అవార్డులు కైవసం చేసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా ఏయూలో మెరైన్ ఇంజినీరింగ్, వాతావరణ, సముద్ర అధ్యయన శాస్త్రం, న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగాలు ప్రారంభించారు. వివిధ విభాగాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. ఏటా వర్సిటీలో చేరడానికి లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. అయితే వర్సిటీలోని వివిధ కళాశాలల్లో దాదాపు 10000 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు.

విద్యార్థులు
విస్తీర్ణం: 425 ఎకరాలు,భవనాలు: 200కు పైగా,విభాగాలు: 58,పరిశోధన కేంద్రాలు: 16,సెమినార్ హాల్స్, తరగతి గదులు: 428,అనుబంధ కళాశాలలు: 305.
Read Also:Vijayasai Reddy: పాకిస్తాన్ కి ఎలా బుద్ది చెప్పాలో మోడీ కి విజయసాయిరెడ్డి సలహా