తల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్న కన్న కొడుకు – విజయనగరంలో హృదయ విదారక ఘటన
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చల్లావాని తోట పంచాయతీ పరిధిలోని నడుపూరు గ్రామం చీకటి చరిత్రకు నిలయమైంది. తల్లిదండ్రులను కన్నబిడ్డే పొట్టన పెట్టిన ఘటన ఇక్కడ చోటుచేసుకుంది. పాండ్రంకి అప్పలనాయుడు (55), జయ (53) అనే దంపతులు నడుపూరులో నివసిస్తూ తమ సొంత భూమిలో కూరగాయలు పండించి జీవనోపాధి కొనసాగిస్తూ వచ్చారు. వీరికి రాజశేఖర్ అనే కొడుకు, రాధ అనే కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం కుమార్తె రాధ వివాహమై ఇద్దరు పిల్లలతో సుఖంగా జీవించేది. అయితే భర్తను కోల్పోయిన రాధ జీవన పోరాటంలోకి జారుకుంది. ఈ కష్ట సమయంలో అమ్మానాన్నలే ఆమెకు అండగా నిలిచారు. ఇదిలా ఉండగా, కొడుకు రాజశేఖర్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ చెడు అలవాట్లకు అలవాటుపడి అప్పుల్లో మునిగిపోయాడు.
ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులపై హత్యా యత్నం
అప్పలనాయుడు తన చిన్నపాటి ఆస్తి అయిన 80 సెంట్ల భూమిలో 50 సెంట్లను కూతురు రాధ పేరు మీద రిజిస్టర్ చేశాడు. ఈ విషయం తెలిసిన రాజశేఖర్ అప్పటి నుంచే భూమి కోసం తల్లిదండ్రులతో గొడవపడుతూ వచ్చాడు. తనకు కూడా వాటా ఇవ్వాలని, లేకపోతే రాధ పేరుమీద చేసిన భూమిని తిరిగి తనకి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తల్లిదండ్రులు మన్నించకపోవడంతో కోపంతో రాజశేఖర్ ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు. భూమిని చదును చేయడానికి ట్రాక్టర్, జెసిబి సాయంతో పనులు సాగుతుండగా, అప్పలనాయుడు దంపతులు అక్కడికి వచ్చి రాధ పేరు మీద ఉన్న భూమిని చెడగొట్టకుండా ఆపేందుకు యత్నించారు. కానీ కోపంతో ఊగిపోతున్న రాజశేఖర్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ట్రాక్టర్ ఎక్కి నేరుగా తల్లిదండ్రులపై దాడికి దిగాడు.
కన్నీరు పెట్టించిన కొడుకు మానవ మృగతనం
పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు పరుగు పరుగున అక్కడ నుండి పారిపోయి రాజశేఖర్ నుండి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే రాజశేఖర్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వారిని గుద్దేందుకు మరోసారి ప్రయత్నించాడు. చివరికి ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలని ప్రయత్నించిన అప్పలనాయుడు, జయ దంపతులు రాజశేఖర్ కాలు మొక్కి మన్నించమని వేడుకున్నా, అతడి హృదయం కరగలేదు. పాశవికంగా ట్రాక్టర్తో ఢీకొట్టి ఇద్దరినీ అతి క్రూరంగా హతమార్చాడు. నిమిషాల వ్యవధిలోనే ఈ భయానక దృశ్యం జరిగింది. అక్కడే పనిచేస్తున్న వర్కర్లు ఈ దారుణ దృశ్యాన్ని చూసి భయంతో పరుగులు తీశారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాజశేఖర్ పరారీలో ఉండగా, అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
సమాజాన్ని శోకసాగరంలో ముంచిన ఘటన
విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణం అందరినీ షాక్కు గురి చేసింది. కతల్లిదండ్రుల ప్రాణాలు తీసే విధంగా కొడుకు అమానుషంగా ప్రవర్తించిన దృశ్యాన్ని స్థానికులు ఆశ్చర్యంతో, విషాదంతో చూస్తున్నారు. మానవ సంబంధాలు మరణిస్తున్న ఈ కాలంలో, మమతలకు విలువ లేకుండా మారిపోతున్న పరిస్థితులు ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఆస్తి కోసం ప్రాణాలు తీసేంతకూ మానవత్వం ఎంత దిగజారిందో ఈ ఘటన మరోసారి ఆవిష్కరించింది.
READ ALSO: Murder: పెరుగుతున్న వివాహేతర సంబంధాలు హంతకులుగా మారుతున్న వైనం