అనంతపురం జిల్లా ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సత్తాచాటిన ప్రతిభావంతులకు ఎంఈఓ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో భాగంగా, బెళుగుప్ప మండల విద్యాధికారి (MEO) మల్లారెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, పది తరగతి ఫలితాల్లో అత్యున్నత మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విమాన ప్రయాణం నిర్వహించారు.
మాట నిలబెట్టుకున్న ఎంఈఓ
బెళుగుప్ప మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరం పది తరగతి పరీక్షల్లో అద్భుతమైన ప్రదర్శన చేశారు. అందులో ముఖ్యంగా ఇందు, లావణ్య, ఈశ్వరి, అర్చన, మధుశ్రీ అనే విద్యార్థినిలు 550కి పైగా మార్కులు సాధించారు. పరీక్షల ముందు, విద్యార్థుల ప్రోత్సాహం కోసం ఎంఈఓ మల్లారెడ్డి ఒక హామీ ఇచ్చారు — “550కి పైగా మార్కులు సాధిస్తే మీకు విమాన ప్రయాణం చేయిస్తాను.” ఈ హామీ మాటలు నిజం చేసాడు. ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థినుల విజయాన్ని చూసి ఎంఈఓ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ వినోద్ కుమార్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారుల అనుమతిని తీసుకుని తన మిషన్ను ప్రారంభించారు.
బెంగళూరు నుంచి హైదరాబాద్కి
గురువారం విద్యార్థినులతో కలిసి మల్లారెడ్డి బెళుగుప్ప నుండి బెంగళూరుకు బయలుదేరి, అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్కు ప్రయాణించారు. ఇది ఈ విద్యార్థినులకు జీవితంలో మొదటిసారి విమానం ఎక్కే అవకాశం. అక్కడ పర్యాటక ప్రదేశాలను చూపించి తీసుకువస్తానని, అందుకు అయ్యే వ్యయాన్ని తానే భరిస్తానని ఎంఈఓ తెలిపారు.
Read also: Chandrababu: అమరావతి ప్రజల చిరకాల కోరిక నెరవేరే రోజు :చంద్రబాబు