సీఎం చంద్రబాబుపై యాంకర్ శ్యామల విమర్శలు..!
అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తాజాగా పార్టీకి నలుగురు కొత్త అధికార ప్రతినిధులను నియమించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావులను అధికార ప్రతినిధులుగా అపాయింట్ చేశారు. ఇదే జాబితాలో ప్రముఖ యాంకర్ శ్యామలకు కూడా చోటు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక కీలక బాధ్యతలు దక్కిన శ్యామల తాజాగా కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలో ఆమె సీఎం చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. “ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ సీఎం జగన్ గురించి పిల్లికి కూడా ఎప్పుడూ బిచ్చం వేయని తండ్రి, కొడుకులు చంద్రబాబు, లోకేశ్ సన్నాయి నొక్కులు చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి. రెండు ఎకరాల నుంచి రెండు వేల ఎకరాల వరకు సంపాదించిన చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతమందికి సాయపడ్డారు అనే విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు.
ఇప్పటివరకు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఏం సాయం చేశారని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కళ్లు తెరిచి చూడండి. చెవులు రెక్కలు విరుచుకుని వినండి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గుండాలు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు.
వాటిలో గాయపడ్డ, నష్టపోయిన సుమారు రెండు వందల మందికి పైగా బాధితుల కుటుంబాలకు జగన్ సాయం చేశారు. అలాగే ఇటీవల ఫార్మా కంపెనీలో సంభవించిన పేలుడు కారణంగా చనిపోయిన 17 మంది కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున జగన్ ఇచ్చారు. ఇదే ఘటనలో గాయపడ్డ 41 మందికి ఒక్కొక్కరికి రూ.1లక్ష చొప్పున మాజీ సీఎం ఆర్థిక సహాయం చేశారు. మీ కంటికి కనిపించలేదా అండీ ఈ సాయం.
ఇక ఇటీవల విజయవాడను వరదలు ముంచెత్తగా వరద బాధితులకు రూ.1కోటి సాయం చేశారు. అలాగే ఇప్పటికీ వారికి నిత్యావసరాలను పంపిణీ చేస్తూనే ఉన్నారు. అలాగే పులివెందులలోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు రూపాయి ఫీజు తీసుకోకుండా ఉచితంగా చదువులు చెప్పిస్తున్నారు. ఎంతోమంది చెవిటి, మూగ పిల్లలకు ఆపరేషన్స్ చేయించారు.
ఎంతోమంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు. ఎంతోమందికి ధన సహాయం అందించారు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. జగన్ వల్ల ఎంతోమంది మేలు జరిగిందే తప్పా.. కీడు జరగలేదు. మీ రాజకీయ జీవితంలో చేసిన సాయాలు ఎన్ని ఉన్నాయో తెలపాలి. అధికార బలం, మీడియా బలం ఉందని.. ఇలా ఏది పడితే అది ప్రచారం చేయడం ఎంతవరకు సబబు” అంటూ చంద్రబాబుపై శ్యామల విరుచుకుపడ్డారు. ఆమె ఘాటు వ్యాఖ్యల తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.