నేటి నుంచి అనంత్-రాధికా వివాహ వేడుక

ప్రముఖ బిజినెస్ మెన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి వేడుక గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంట్లో మరికాసేపట్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లి జరగనుంది. నేటి నుంచి జులై 14 వరకు ఈ వేడుక కొనసాగుతుంది. దీనికి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కానుంది. జులై 12న శుభ్ వివాహ్, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ్ ఉత్సవ్ వంటి సంప్రదాయ కార్యక్రమాలుంటాయి. వ్యాపార, క్రీడా, సినిమా, రాజకీయ రంగాల్లో టాప్ సెలబ్రిటీలతో పాటు పలువురు విదేశీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతున్నారు.

ఇక మొత్తం వివాహ మహోత్సవం ఖర్చు రూ. 4,000-5,000 కోట్ల (0.6 బిలియన్ డాలర్లు) మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది అంబానీ కుటుంబ నికర విలువలో కేవలం 0.5 శాతం మాత్రమే కావడం విశేషం. అనంత్ మర్చంట్, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక మొత్తం ఖర్చు దాదాపు రూ. 1,000 కోట్లుగా అంచనా వేయబడింది. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకకు రూ.500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇది కాకుండా మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుక కోసం దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వేడుక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాలలో ఒకటిగా నిలువనుంది.

అంబానీ కుటుంబం పంపిన ఇన్విటేషన్ కార్డ్ ఖరీదు దాదాపు రూ.7 లక్షలు ఉంటుందని సమాచారం. వీరి పెళ్లికి 2500 మందికి పైగా ముఖ్యమైన అతిథులను ఆహ్వానించారు. అతిథులను తరలించేందుకు అంబానీ కుటుంబం మూడు ఫాల్కన్ 2000 జెట్‌లను అద్దెకు తీసుకున్నారు. దీంతోపాటు ఈ వేడుక కోసం 100 కంటే ఎక్కువ ప్రైవేట్ జెట్‌లను ఉపయోగిస్తున్నారు.