ఆంధ్రప్రదేశ్ అమరావతి చివరికి కొత్త ఆశలతో ముందుకు సాగనుంది. మే 2న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అమరావతికి రానున్నారు. ఈ సందర్బంగా రూ.49,040 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు.ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా వెల్లడించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా రాజధాని నిర్మాణానికి ఇదే సరైన సమయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు ఈ ఉద్యమానికి బలమైన ఆధారంగా నిలవాలని కోరారు.ఈ రోజు ప్రత్యేకత ఇంతటితో ముగియదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో రూ. 57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులు కూడా మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.

డీఆర్డీవో, రైల్వేలు, ఎన్హెచ్ఏఐ వంటి కీలక శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.పాత ప్రభుత్వ పరిపాలనలో జరిగిన నష్టాల్ని పూడ్చే బాధ్యత తమదేనని సీఎం స్పష్టం చేశారు. పదినెలల్లోనే అభివృద్ధికి గట్టి బాట వేసినట్టు తెలిపారు.రాష్ట్రాభివృద్ధికి బలమైన మద్దతుగా విశాఖలో టీసీఎస్ ఏర్పాటు, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం వేగంగా సాగుతున్నాయన్నారు. శ్రీసిటీలో ఎల్జీ కంపెనీ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక స్థిరతకు ఉపకరిస్తాయని వివరించారు.పోలవరం ప్రాజెక్టు 2027లో పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ప్రాంత అభివృద్ధే ఎన్డీఏ లక్ష్యమని, స్వర్ణాంధ్ర విజన్ 2047 దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.గత ప్రభుత్వ పాలనలో మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేసిందని సీఎం విమర్శించారు.
రైతుల త్యాగాలను తక్కువ చేసారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈసారి ప్రజల ఆశల మేరకు రాజధానిని గర్వంగా చెప్పుకోదగిన స్థాయికి తీసుకెళ్తామన్నారు.ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థల సహకారం కూడా అందుబాటులో ఉందన్నారు. వచ్చే ఆదాయంతో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామన్నారు.కార్యకర్తలే పార్టీ బలం అని సీఎం పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వచ్చే నెలలో ‘అన్నదాతకు వందనం’, ‘తల్లికి వందనం’ పథకాలు ప్రారంభిస్తామన్నారు.సింహాచలంలో ప్రహరీ గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని అమరావతిలో నుంచే పర్యవేక్షించామని తెలిపారు. మంత్రులు బాధిత కుటుంబాలను పరామర్శించారని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Read Also : Modi: అమరావతి పునఃప్రారంభ సభలో ఆకట్టుకుంటున్న స్క్రాప్ మోదీ విగ్రహం