ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజధాని అమరావతి రీలాంచ్కు అంతా సిద్ధమైంది. అమరావతిలో పునఃనిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. రేపటి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసింది. దీన్ని రాష్ట్ర అభివృద్ధికి మలుపు తిప్పే ఘట్టంగా ప్రభుత్వం భావిస్తోంది.
లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన
ప్రధాని మోదీ చేతుల మీదుగా మొత్తం రూ. లక్ష కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో హైకోర్టు భవనం, సెక్రటేరియట్, అసెంబ్లీ, ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాలు, తదితర కీలక సౌకర్యాల నిర్మాణం భాగంగా ఉంటుంది. మొత్తం 49,040 కోట్ల విలువైన పనులకు అమరావతిలో శంకుస్థాపనలు జరుగనున్నాయి.

కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన
అమరావతి పరిధిలో మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా కేంద్రానికి చెందిన డీఆర్డీవో, డీపీఐఐటీ, ఎన్హెచ్ఏఐ, రైల్వే శాఖలకు సంబంధించిన 57,962 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా నాగాయలంకలో రూ.1500 కోట్లతో మిసైల్ టెస్ట్ రేంజ్ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇది దేశ రక్షణ రంగంలో భారీ పురోగతికి దారి తీసే అవకాశం ఉంది.
ప్రధాన వేదికపై ఉన్న ప్రత్యేకతలు
ఈ గ్రాండ్ ఈవెంట్కు ప్రధాన వేదికపై కేవలం 14 మంది ప్రముఖులకు మాత్రమే అనుమతి ఇవ్వబడింది. అందులో ప్రధానంగా ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఉండనున్నారు. భద్రతా దృష్ట్యా ఎస్పీజీ (SPG) విభాగం వేదికను పూర్తిగా అధీనంలోకి తీసుకుంది. ప్రధాని హెలికాప్టర్లో వచ్చి, కారు మార్గంలో వేదికకు చేరుకొని అభివాదం చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ప్రజల కోసం విశేష ఏర్పాట్లు
ఈ కార్యక్రమానికి ప్రజలంతా పెద్ద సంఖ్యలో హాజరుకావడానికి మూడు వేర్వేరు ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. వేదిక మాత్రం ఒక్కటే. ప్రజలను ఉదయం 11 గంటల నుంచే సభ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక మార్గాలు సూచించగా, వర్షం వస్తే భద్రత కోసం టెంట్లు, చైర్లు, గాలెరీలు ఏర్పాటు చేశారు. అమరావతి రైతులకు ప్రత్యేక గ్యాలరీ కేటాయించారు. అలాగే మహిళల కోసం CRDA ప్రత్యేక పిలుపునిచ్చి, ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానం అందించింది. ప్రొటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రధాన మౌలిక సదుపాయాలతో పాటు, ప్రధాని చేతుల మీదుగా అమరావతి రీస్టార్ట్ పైలాన్ ఆవిష్కరణ జరగనుంది. ఇది ‘A’ అక్షరాకారంలో, 21 అడుగుల ఎత్తుతో, పూర్తి గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. ఇది రాజధాని పునఃనిర్మాణానికి ప్రతీకగా నిలవనుంది. అమరావతి పేరు తొలి అక్షరం ‘A’ రూపకల్పనకు ప్రేరణగా ఉపయోగించారు. ఈ పైలాన్ తాత్కాలికంగా కాదు, శాశ్వత గుర్తుగా మిగిలేలా నిర్మిస్తున్నారు.
Read also: Amaravati: అమరావతి రీ లాంచ్ కార్యక్రమానికి జగన్ను ఆహ్వానించిన కూటమి