ఆర్టీసీ కార్మికులంతా తెలంగాణ ఉద్యమకారులే: పొన్నం ప్రభాకర్‌

All RTC workers are Telangana activists: Ponnam Prabhakar

హైదరాబాద్‌: శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభలో ఆయన మాట్లాడుతూ… విపక్ష సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేయడం సరికాదన్నారు. ప్రతిపక్ష నాయకులు అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీ 70వ దశకంలోనే నవోదయ పాఠశాలలు, గురుకులాలను ప్రారంభించిందని తెలిపారు. వాటిల్లో చదివిన వారు చాలామంది ఉన్నతస్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు. జీవచ్ఛవంలా ఉన్న ఆర్టీసీని తాము ముందుకు తీసుకు వెళుతున్నామన్నారు. ఆర్టీసీ చక్రం నడవదని గతంలో చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు అదే సంస్థపై మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులంతా తెలంగాణ ఉద్యమకారులే అన్నారు. వారిని కాపాడుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదే అన్నారు.